Kurnool | కర్నూల్ : ఓ భార్య తన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా పత్తికొండలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పత్తికొండకు చెందిన హరిప్రసాద్(60) తన భార్య లలితతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇంటి ఆవరణలో హరిప్రసాద్ మంటల్లో కాలిపోయిన దృశ్యాలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లలితను విచారించారు. తన భర్త గుండెపోటుతో చనిపోయాడని, తనకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించానని ఆమె తెలిపింది. తన పిల్లలు ఇద్దరూ కెనడాలో ఉంటున్నట్లు ఆమె పేర్కొంది.
అయితే స్థానికులు ఆమె మాటలను నమ్మలేకపోతున్నారు. వృద్ధుడైన తన భర్తకు సేవలు చేయలేకనే లలిత ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిద్రిస్తున్న భర్తపై అట్టముక్కలు పేర్చి నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో హరిప్రసాద్ పూర్తిగా కాలి బూడిదైపోయారని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.