Basara IIIT | నిర్మల్ : బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
దీపిక ఇవాళ ఉదయం ఫిజిక్స్ ఎగ్జామ్ రాసి.. హాస్టల్కు చేరుకుంది. అయితే బాత్రూమ్కు వెళ్లిన ఆమె ఎంత సేపటికి కూడా తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థినులు యూనివర్సిటీ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో బాత్రూమ్ తలుపులను బద్దలుకొట్టి చూడగా, దీపిక ఉరేసుకుంది. హుటాహుటిన విద్యార్థినిని భైంసా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండల పరిధిలోని గోరేకల్. దీపిక ఆత్మహత్య వార్త విన్న తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే దీపిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీపిక ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపిక సూసైడ్ చేసుకోవడంతో ఆమె ఫ్రెండ్స్ బోరున విలపించారు.