Dog Attack | కాజీపేట : రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల( Dogs ) బెడద ఎక్కువైపోయింది. కుక్కల దాడుల్లో ఇప్పటికే ఒకరిద్దరు పిల్లలు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఎక్కడైనా కుక్క కనిపిస్తే చాలు.. పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దల వరకు అప్రమత్తం అవుతున్నారు. కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మాదిరిగానే ఓ బాలుడు( Boy ) కూడా కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో పరుగెత్తగా, ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో చేయి విరిగిపోయింది. తన కుమారుడి చేయి విరగడానికి ఆ కుక్కనే కారణమని, దాని యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి.
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా( Hanumakonda Dist ) కాజీపేట( Kajipeta )కు చెందిన ఎండీ ముస్తాఫా(9) పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో( Govt school ) మూడో తరగతి చదువుతున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల వదలగానే.. తన తండ్రి పని చేసే ప్రాంతానికి ముస్తాఫా బయల్దేరాడు. మార్గమధ్యలోనే ఓ పెంపుడు కుక్క( Pet Dog ) బాలుడిని వెంబడించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ విద్యార్థి పరుగెత్తాడు. ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో.. అతని ఎడమ చేయి విరిగిపోయింది. తన కుమారుడు ముస్తఫా చేయి విరగడానికి కారణమైన కుక్క యజమానిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని తండ్రి రషీద్ స్థానిక పోలీస్ స్టేషన్( Police Station )లో ఫిర్యాదు చేశాడు.