పాట్నా: కారులో తరలిస్తున్న 8 కెమెరా డ్రోన్లను నేపాల్ సరిహద్దు సమీప ప్రాంతంలో సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)కి చెందిన జవాన్లు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా నేపాల్, బీహార్ సరిహద్దు ప్రాంతంలోని మోతిహరీ వద్ద ఒక కారును నిలువరించి సోదా చేశారు. కారులో దాచి తరలిస్తున్న 8 చైనా తయారీ కెమెరా డ్రోన్లను గుర్తించారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. కాగా స్థానికులైన వీరు వెడ్డింగ్ వీడియోగ్రఫీ కోసం ఈ డ్రోన్లను తీసుకెళ్తున్నట్లు చెప్పారని, దర్యాప్తు తర్వాత వాస్తవం ఏమిటన్నది తెలుస్తుందని సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు. జమ్ము ఎయిర్ బేస్పై ఆదివారం డ్రోన్లతో దాడి జరిగిన నేపథ్యంలో సరిహద్దుల్లో పటిష్ఠ నిఘాతోపాటు డ్రోన్ల రవాణాపై భద్రతా సిబ్బందిని అలెర్ట్ చేశారు.