తిరువనంతపురం: భార్యాభర్తల మధ్య తగాదా అభంశుభం తెలియని ఓ ఆరేండ్ల బాలుడిని బలితీసుకుంది. ఓ వ్యక్తి తన వదిన (భార్య సోదరి) మీద కక్షతో ఆమె ఆరేండ్ల కొడుకును అత్యంత దారుణంగా హత్యచేసి పారిపోయాడు. కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లాలోని అనక్కలుంగల్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన షాజహాన్, సబిత ఇద్దరూ భార్యాభర్తలు. వీరి ఇంటికి సమీపంలోనే షాజహాన్ వదిన సాఫియా కుటుంబం కూడా నివాసం ఉంటున్నది.
ఈ క్రమంలో ఇటీవల షాజహాన్ భార్యతో గొడవపడ్డాడు. దాంతో ఆమె భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో భార్య తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లడానికి వదిన సాఫియానే కారణమని షాజహాన్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజమున వదిన ఇంటికి వెళ్లిన షాజహాన్.. వదినపైన, వదిన ఆరేండ్ల కొడుకుపైన సుత్తితో దాడికి పాల్పడ్డాడు. వదిన కుమార్తెపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఆమె తప్పించుకుని పారిపోయింది.
షాజహాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకులను ఇరుగుపొరుగు ఇడుక్కిలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే బాలుడు అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. అతని తల్లి సాఫియా మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు షాజహాన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.