Gurugram | గురుగ్రామ్ పరిధిలోని ఓ రెస్టారెంట్ లో భోజనం తర్వాత తీసుకున్న మౌత్ ఫ్రెష్ నర్ వల్ల ఐదుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతోపాటు నోటి నుంచి రక్తం రావడంతో దవాఖాన పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రేటర్ నోయిడా వాసి అంకింత్ కుమార్ తన భార్య, నలుగురు స్నేహితులతో ‘సెక్టార్ 90’లోని ఒక రెస్టారెంట్కు వెళ్లారు.
భోజనం తర్వాత వెయిటర్ ఇచ్చిన మౌత్ ఫ్రెష్ నర్ వాడిన కొద్దిసేపటికే నోట్లో మంట, వాంతులు రావడంతోపాటు రక్తం కూడా వచ్చిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే రెస్టారెంట్ సిబ్బంది పరారయ్యారన్నారు. మౌత్ ఫ్రెష్ నర్ కు బదులు పొడి మంచు ఇవ్వడం వల్లే ఇలా జరిగి ఉంటుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.