లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో కలకలం రేపిన 16 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో 35 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫిలిబిత్లో జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితులు పెద్దసంఖ్యలో ఉంటారనే అనుమానంతో 12 బృందాలు దర్యాప్తు సాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ 35 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో పది మందిని ప్రశ్నిస్తున్నారు.
పిలిభిత్ జిల్లాలోని బర్కేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఉదయం 6.45 గంటలకు స్కూల్కు వెళ్లిన బాలిక సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా తిరిగి రాలేదు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి 500 మీటర్ల సమీపంలో బాలిక అర్ధనగ్నంగా విగతజీవిగా పడిఉంది. బాలిక సైకిల్, స్కూల్ బ్యాగ్ మృతదేహం పక్కన కనిపించాయి. ఘటనా స్ధలంలో బీరు బాటిళ్లు పడిఉన్నాయి. బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ఆరోపించిన కుటుంబ సభ్యులు ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు.