చేవెళ్ల టౌన్, ఆగస్టు 27: గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీ గార్డెన్ సమీపంలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన శివయ్య కుమారుడు ఎం జయవర్ధన్ (18), కిష్టయ్య కుమారుడు విష్ణువర్ధన్ (18) చేవెళ్లలో ఇంటర్ చదువుతున్నారు. లాలయ్య చిన్నకుమారుడు ఎర్రోళ్ల ప్రసాద్కుమార్ (12) దేవుని ఎర్రవల్లిలోనే తొమ్మిదోతరగతి చదువుతున్నాడు. శుక్రవారం జయవర్ధన్ పుట్టినరోజు కావడంతో బైక్పై ముగ్గురు చేవెళ్లకు వెళ్లి కేక్ తీసుకొని ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలోని బాలాజీ గార్డెన్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.