హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిగూడలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన మరవకముందే నగరంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాగ్ అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానికంగా ఉన్న ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో రెండు గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత వ్యక్తులు బోరున విలపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బుధవారం తెల్లవారుజామున బోయిగూడలోని ఓ స్క్రాప్ గోడౌన్లో చెలరేగిన మంటలకు మొత్తం 11 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరు సజీవదహనం కాగా, మరికొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గాయపడిన వ్యక్తికి కూడా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అయితే మృతదేహాలను రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి పాట్నాకు తరలించనున్నారు.