ముంబై: రూ.2,200 రుణం రికవరీ కోసం ఒక మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడంతోపాటు బంధువులు, స్నేహితులకు వాటిని పంపారు. రుణ రికవరీ ఏజెంట్ల ఆగడాలను భరించలేకపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. విక్రోలి ప్రాంతంలో నివాసం ఉండే 28 ఏళ్ల మహిళ రెండు లోన్ యాప్ల ద్వారా రూ.2,200 రుణం తీసుకుంది. తిరిగి చెల్లించేందుకు వారం రోజులు గడువు ఉంది. అయితే లోన్ రికవరీ ఏజెంట్లు నాలుగో రోజు నుంచే ఆ మహిళకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. గడువు ఉన్నప్పటికీ రుణం తీర్చాలని బెదిరించారు. అంతేగాక ఆ మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపి ఆమె గౌరవాన్ని దిగజార్చేలా చేశారు.
లోన్ యాప్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేని ఆ మహిళ విక్రోలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చిన 13 నంబర్లను ఫిర్యాదులో పేర్కొంది. ఆ నంబర్ల నుంచే తన మార్ఫింగ్ ఫొటోలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపారని ఆరోపించింది. ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా లోన్ యాప్స్ రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో లోన్ యాప్స్, సంబంధిత ఏజెంట్ల వేధింపులపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని చెప్పారు.