కోల్కతా : ఓ 28 ఏండ్ల యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేశాడు. మహిళలను పెళ్లి చేసుకొని, వారితో కొద్ది రోజులు కాపురం చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. అలా ఒకరిద్దరిని కాదు.. ఏకంగా 24 మంది మహిళలను పెళ్లి చేసుకుని, అందర్నీ మోసం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్కు చెందిన అసబుల్ మొల్లా(28) జులాయిగా తిరిగేవాడు. కొన్ని సందర్భాల్లో రోడ్డు నిర్మాణ కార్మికుడిగా పని చేసి డబ్బు సమకూర్చుకునేవాడు. ఇక తనకు ఎవరైనా మహిళ నచ్చితే ఆమెను సంప్రదించేవాడు. తాను జేసీబీ డ్రైవర్నని, అనాథనని పరిచయం చేసుకునేవాడు. వారితో ఎంతో సౌమ్యంగా మాట్లాడి తన వలలో దింపేవాడు. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. అలా ఫేక్ ఆధార్ కార్డులతో 24 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ప్రతి మహిళ వద్ద కొద్ది రోజులు మాత్రమే కాపురం చేసేవాడు. ఆ మహిళల వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లేవాడు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ను స్విచ్ఛాప్ చేసేవాడు. చేసేదేమీ లేక బాధిత మహిళలంతా తాము మోసపోయామని గ్రహించేవారు.
బెంగాల్లోని సాగర్దిఘియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. అసబుల్ మొల్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత కొద్ది రోజులు మాత్రమే కాపురం చేసి, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అతను టవర్ లోకేషన్ చేంజ్ చేస్తున్న పోలీసులు గ్రహించారు. మొత్తానికి అసబుల్ పై నిఘా పెట్టి.. అతన్ని సెప్టెంబర్ 28న పోలీసులు అరెస్టు చేశారు. తాను చేసిన నేరాలను పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు అసబుల్.