వికారాబాద్, జూలై 1 : పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, కమిషనర్ భోగేశ్వర్లు వికారాబాద్లోని 32వ వార్డు కౌన్సిలర్ నవీన్కుమార్కు మొక్కలు నాటాలని సూచించారు. 31వ వార్డు శివరాంనగర్ కాలనీలో కౌన్సిలర్ గాయత్రితో కలిసి మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. పెండ్లిమడుగులో ఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఎంపీపీ చంద్రకళ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. మొక్కలను నాటడంతోపాటు వాటిని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని.. దీంతో ఆరోగ్య గ్రామంగా మారుతుందన్నారు. రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి సంరక్షించుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీలత యాదవ్, ప్రత్యేకాధికారి సరిత ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నవాజ్ పాల్గొన్నారు.
ప్రకృతివనం పరిశీలన
మర్పల్లి, జూలై 2 : మండలంలోని పెద్దాపూర్ గ్రామాన్ని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ సందర్శించి ప్రకృతివనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలను అందంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని, ప్రతి ఇంటి ఆవరణలో పండ్లు, పూల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.
మొక్కలు పంపిణీ
మోమిన్పేట, జూలై 2 : మండల పరిధిలోని మేకవనంపల్లి, ఎన్కతల, టేకులపల్లి గ్రామాల్లో ఇంటింటికి పూలమొక్కలు, పండ్ల మొక్కలను మహిళలు, చిన్నారులకు ఎంపీవో శాంత, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేశారు.