రాయ్పూర్ : ఓ ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు జైలు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయారు. అది కూడా 23 అడుగుల ఎత్తులో ఉన్న జైలు గోడ దూకి పరారీ అయ్యారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లా జైల్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా జష్పూర్ అడిషనల్ ఎస్పీ ఉమేశ్ కశ్యప్ మాట్లాడుతూ.. జిల్లా జైల్లో ఉంటున్న ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు కపిల్ భగత్, లలిత్ రామ్ కలిసి 23 అడుగుల ఎత్తులో ఉన్న గోడ దూకి పారిపోయారని తెలిపారు. కపిల్ భగత్ అత్యాచారం కేసులో నిందితుడు కాగా, లలిత్ రామ్ హత్య కేసులో నిందితుడు అని పేర్కొన్నారు. అయితే జైలు సిబ్బంది సోమవారం ఉదయం వంట పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఖైదీలు పరారీ అయినట్లు తేలిందన్నారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, ఖైదీల ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.