హైదరాబాద్ : ఆ కుటుంబానికి పెట్ డాగ్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో ఓ కుక్క పిల్లను తీసుకొచ్చి.. పెంచుకుంటున్నారు. అయితే ఆ శునకం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని మహిళ దాన్ని దొంగిలించింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళ్తే.. అమీర్పేట నాగార్జున నగర్కు చెందిన ఓ కుటుంబం.. పప్పీ(2 నెలలు) అనే పెట్ డాగ్ను పెంచుకుంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆ కుక్క ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ సమయంలోనే అటుగా వచ్చిన ఓ గుర్తు తెలియని మహిళ కుక్క పిల్లను తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం చున్నీతో కుక్క పిల్లను కవర్ చేసి అటు నుంచి తీసుకెళ్లింది. ఇంట్లో ఉన్న దంపతులకు పెట్ డాగ్ కనిపించకపోయేసరికి ఆందోళనకు గురయ్యారు. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుక్క ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.