ఈరోడ్: ఆ బాలుడికి 17 ఏండ్లు. బాలికకు 15 ఏండ్లు. ఇద్దరూ మైనర్లే. ఇద్దరి కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉన్నది. ఈ క్రమంలో బాలుడు, ఆ బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. ఆపై బలవంతంగా వివాహం కూడా చేసుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ జిల్లాలోని భవానీ తాలూకా ఒలగడం గ్రామంలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను కుటుంబసభ్యులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒలగడం గ్రామానికి బాలిక స్థానికంగా 10వ తరగతి చదువుతున్నది. బాలిక కుటుంబంతో బంధుత్వం ఉండటంతో అదే గ్రామానికి చెందిన 17 ఏండ్ల బాలుడు తరచూ వాళ్ల ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సదరు బాలుడు రెండు రోజుల క్రితం బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లాడు. దాంతో బాలిక పేరేంట్స్ స్థానిక పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. తరచూ వాళ్లింటికి వెళ్లే బాలుడే ఆ బాలికను కిడ్నాప్ చేసినట్లు తేలింది.
దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి వాళ్ల కోసం గాలించారు. ఎట్టకేలకు ట్రేస చేసి పట్టుకున్నారు. అనంతరం బాలికను ఆమె పేరెంట్స్కు అప్పగించారు. బాలుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం జువైనల్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు నిందితుడిని జువైనల్ హోమ్కు తరలించాలని ఆదేశించింది.