ముంబై : ఓ ఎనిమిది మంది క్రూరమృగాల్లా విరుచుకుపడ్డారు. కామంతో చెలరేగిపోయారు. 16 ఏండ్ల అమ్మాయిపై 12 గంటల పాటు అత్యాచారం చేశారు. ఈ అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ 16 ఏండ్ల అమ్మాయికి మాయమాటలు చెప్పి.. నిర్మానుష్య ప్రదేశంలోని ఓ పాత బంగ్లాలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై ఓ 8 మంది యువకులు అత్యాచారం చేశారు. వారి దాడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో నన్ను పాత బంగ్లా వద్దకు తీసుకెళ్లాడు ఓ యువకుడు. ఆ బంగ్లాలోకి తీసుకెళ్లిన అనంతరం మొత్తం 8 మంది కలిసి తనపై అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు తనపై విరుచుకుపడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అంతటితో తనను వదిలేయకుండా, సముద్ర తీర ప్రాంతంలోని ఓ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా అత్యాచారం చేశారని బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనకు పాల్పడ్డ 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.