అమ్మను కరోనా కాటేస్తే.. ఆమె కూతురిని కామాంధులు కాటేశారు.. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా 8 నెలల పాటు ఆ అమ్మాయిని ఓ ఆటబొమ్మలా చూశారు. అన్నెం పున్నెం ఎరుగని ఆమె పట్ల క్రూర మృగాల్లా ప్రవర్తించారు.. నిరంతరం ఆ బాలికపై అత్యాచారం చేస్తూ రాక్షసానందం పొందారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ గతేడాది జూన్లో కరోనా బారిన పడింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న సమయంలో ఆ మహిళకు.. సవర్ణ కుమారీ అనే మరో మహిళ పరిచయమైంది. ఇరువురి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. అయితే మీ బిడ్డ(13)ను దత్తత తీసుకుంటానని నమ్మబలికింది సవర్ణ కుమారీ. అదే ఏడాది ఆగస్టులో ఆ బాలిక తల్లి కరోనాతో పోరాడి ఓడింది. ఇదే అదునుగా భావించిన సవర్ణ.. తండ్రికి చెప్పకుండానే 13 ఏండ్ల చిన్నారిని తన వెంట తీసుకెళ్లింది.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సవర్ణ.. ఆ బాలికను తీసుకొని ఇంటికి వెళ్లిందా? అంటే లేదు. నేరుగా వ్యభిచార గృహం వద్దకు తీసుకెళ్లింది. బ్రోతల్ హౌస్లోనే ఆ చిన్నారిని ఉంచింది. అలా అమాయకురాలైన ఆ బాలికను కామాంధుల పాలిట పడేసింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 8 నెలల పాటు 80 మంది వ్యక్తులు ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. కొందరైతే ఆ అమ్మాయిని కొనుక్కుని, అత్యాచారం చేస్తూ రాక్షసానందం పొందారు.
అయితే భార్యను పోగొట్టుకున్న భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బిడ్డ కూడా కనిపించకుండా పోవడంతో మరింత కుంగిపోయాడు. చివరకు తన బిడ్డ ఆచూకీ తెలపాలని గుంటూరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయాలు వెలుగు చూశాయి. ఈ ఏడాది జనవరిలో సవర్ణ కుమారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత విడతల వారీగా 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, కాకినాడ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 53 సెల్ ఫోన్లు, మూడు ఆటోలు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఓ నిందితుడు ప్రస్తుతం లండన్ లో ఉన్నట్టు చెప్పారు. అతడిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాలికను కూడా విచారించగా తనపై 8 నెలల పాటు అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేసింది.