మేడ్చల్ మల్కాజ్గిరి : ఉప్పల్ పరిధిలోని మల్లాపూర్ చౌరస్తాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించిన నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులకు చెందిన కారులో నుంచి 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్కుమార్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి, గంజాయి రవాణాను అడ్డుకున్నారు.
అయితే ఓ వ్యక్తి అరకు నుంచి గంజాయిని హైదరాబాద్కు తీసుకొచ్చాడు. మల్లాపూర్ చౌరస్తాలో మరో ముగ్గురు వ్యక్తులు గంజాయి కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. కారులో ఓ వ్యక్తి గంజాయి తీసుకొస్తున్నాడని వారు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అక్కడే ఉండి, గంజాయిని తరలిస్తున్న కారును గుర్తించి సీజ్ చేశారు. ఈ గంజాయిని పుణె తరలించేందుకు ముగ్గురు వ్యక్తులు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు.
కారులో ఉన్న 125 కిలోల గంజాయితో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, రూ. 92 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒడిశాకు చెందిన శంకర్ బెహారా అరకులో 125 కిలోల గంజాయిని(కిలో గంజాయి రూ. 2000) కొనుగోలు చేశాడు. దీన్ని మిగతా ముగ్గురికి రూ. 5 వేల చొప్పున కిలో గంజాయిని విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నాడు. పుణెలో రూ. 12 వేల చొప్పున కిలో గంజాయిని అమ్మేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు.