న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇటీవల దళిత బాలిక హత్యాచార ఘటన మరువకముందే పొరుగున ఉండే హర్యానాలోని గురుగ్రాం జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన 15 ఏండ్ల దళిత బాలికపై భూస్వామి బంధువు ప్రవీణ్ లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఘటనలో ఆయన భార్య పాత్రపై ఆరా తీస్తున్నారు.
తమ బాలిక అనారోగ్యంతో మరణించిందని నిందితుడు నమ్మబలుకుతూ అంత్యక్రియలు జరపాలని తొందరపెట్టాడని బాధితురాలి తండ్రి ఆరోపించారు. స్ధానికులు అనుమానంతో ఈ తంతును అడ్డగించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలి తండ్రికి సూచించారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఆమె ముఖంచ ఛాతీపై గాయాలయ్యాయని అటాప్సీ నివేదికలో వెల్లడైంది. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై నిందితుడు ప్రవీణ్, ఆయనకు సహకరించిన బంధువులపై హత్య, లైంగిక దాడి కేసులు నమోదు చేశామని గురుగ్రాం పోలీసులు తెలిపారు.