కావలసిన పదార్థాలు
మైదా: అరకప్పు, కార్న్ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, టమాట, క్యారెట్, ఆలుగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిగడ్డ: ఒకటి, నూనె: పావు కప్పు, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, గరం మసాలా: పావు టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా.
తయారీ విధానం
పాన్లోని నూనె వేడయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేయాలి. అవన్నీ వేగాక క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, టమాట ముక్కలు వేసి బాగా వేయించాలి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర తురుము జోడించి మరో మూడు నిమిషాలు వేయించి దించి చల్లార్చుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావుగంటపాటు నాన బెట్టాలి. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పలుచని చపాతీల్లా చేసుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టి చపాతీలను పది సెకన్లపాటు రెండువైపులా కాల్చి తీసేయాలి. ఇప్పుడు ఒక్కో చపాతీ మధ్యలో కూరగాయల మిశ్రమం పెట్టి అన్నివైపులా మూసి రోల్స్లా చుట్టుకుని చివర్లను మైదా నీళ్లతో అంటించాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక చుట్టి ఉంచిన రోల్స్ వేసి దోరగా కాల్చుకుంటే కరకరలాడే వెజ్ రోల్స్ రెడీ.