గోధుమపిండి: రెండు కప్పులు, ముల్లంగి తురుము: ఒక కప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: అంగుళం ముక్క, ఆమ్చూర్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా: ఒక టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: సరిపడా.
ముందుగా గోధుమపిండిలో ఉప్పు, ఒక టేబుల్స్పూన్ నూనె వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ముల్లంగి తురుములోని నీళ్లను గట్టిగా పిండి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ముల్లంగి తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, ఆమ్చూర్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, చాట్మసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమపిండి తీసుకుని కొద్దిగా ఒత్తుకుని మధ్యలో ముల్లంగి తురుము పెట్టి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి. పెనం వేడయ్యాక రెండువైపులా నూనెవేసి కాల్చుకుంటే ముల్లంగి పరోటా సిద్ధం.