సోయా గ్రాన్యూల్స్ (మీల్ మేకర్స్): ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, శనగపప్పు: పావు కప్పు, శనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, ధనియాలు: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: ఒక టీస్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, లవంగాలు: ఆరు.
సోయా గ్రాన్యూల్స్లో కొద్దిగా ఉప్పువేసి, వేడినీళ్లు పోసి గంటపాటు నానబెట్టి గట్టిగా పిండుకోవాలి. ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలను బరకగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్, తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, తరిగిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, మసాలాపొడి వేసి బాగా కలిపి శనగపిండి, మసాలాపొడి, కార్న్ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు చల్లి గట్టిముద్దలా కలుపుకోవాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసుకుని, బాగా వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేతిలో ఒత్తుకుని వడలు వేసుకుంటే కరకరలాడే మీల్మేకర్ మసాలా వడలు సిద్ధం.