కావలసిన పదార్థాలు: సేమ్యా: ఒక కప్పు, ఓట్స్: అర కప్పు, క్యారెట్, కాప్సికం, పచ్చి బఠానీలు: పావు కప్పు, ఉల్లిపాయ: ఒకటి చిన్నది, పచ్చిమిర్చి: మూడు, కరివేపాకు: ఒక రెమ్మ, కొత్తిమీర: కొద్దిగా, ఆవాలు, జీలకర్ర: పావు టీ స్పూన్ చొప్పున, శనగపప్పు: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, నెయ్యి: రెండు టీ స్పూన్లు.
తయారీ విధానం: కడాయిలో చెంచానిండా నెయ్యి వేసి వేడయ్యాక సేమ్యాను దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో మరో చెంచా నెయ్యి వేడి చేసి ఓట్స్ను దోరగా వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, కాప్సికం చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు మరిగించి, వేయించిన సేమ్యా వేయాలి. సేమ్యా ముప్పావు ఉడికిన తర్వాత దింపి జల్లెడ లేదా చిల్లుల పళ్లెంలో వేసి వెంటనే చల్లటి నీళ్లు పోయాలి. దీనివల్ల సేమ్యా ముద్దగా కాకుండా పొడిపొడిగా అంటుకోకుండా ఉంటుంది. మరో గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక శనగపప్పు, కరివేపాకు వేయాలి. అది కొద్దిగా వేగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కాస్త మెత్తబడే వరకు వేపాలి. తర్వాత ఇందులో క్యారెట్, కాప్సికం ముక్కలు, పచ్చి బఠానీలు వేసి నిదానంగా వేయించాలి. ఇప్పుడు వేయించిన ఓట్స్ వేసి కలిపి కొద్దిగా వేపి సేమ్యా వేసి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టి, రెండు నిమిషాలు మగ్గనిస్తే చాలు. వేడివేడి ఓట్స్ సేమ్యా ఉప్మా రెడీ.