ఇంటి వంటలో వెరైటీల సంగతేమో గానీ, బయటి నుంచి తెప్పించుకునే ఆహారంలో మాత్రం బిర్యానీ రాజ్యమేలుతున్నది. అందులో చికెన్తో దోస్తీ చేసిన ఈ వంటకాన్ని తెగ ఆర్డరిస్తున్నారు భోజన ప్రియులు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గణాంకాల ఆధారంగా 2022లో మనదేశంలో అత్యధిక ఆర్డర్లు పొందిన ఆహారంగా చికెన్ బిర్యానీ అగ్రభాగాన నిలిచింది. వరుసగా ఏడేండ్లు ఈ ఖ్యాతిని మూటగట్టుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డరిచ్చారట. అంటే సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు బుక్ అయ్యాయన్నమాట! బిర్యానీ తర్వాత అత్యధిక ఆర్డర్లు సొంతం చేసుకున్న వంటకం మసాలా దోశ. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ ఫ్రైడ్రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్లు నిలిచాయి. మొత్తంగా గతేడాది రకరకాల రుచులు చికెన్ బిర్యానీ ఘుమఘుమల ముందు బలాదూర్ అయ్యాయి.