Amazon : ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అమెజాన్ అకాడమీని వచ్చే ఏడాది భారతదేశంలో నిలిపివేస్తున్నట్టు గురువారం ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలిపింది. 2023 ఆగష్టు నాటికి భారతదేశంలో అమెజాన్ అకాడమీ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మొత్తం డబ్బులు తిరిగిస్తామని అమెజాన్ చెప్పింది. అంతేకాదు యూజర్లకు 2024 అక్టోబర్ వరకు ఆన్లైన్లో కోర్సు మెటీరియల్ను అందించనుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనేది మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. ఉద్యోగుల జీతాల ఖర్చులు తగ్గించుకోవడం, డబ్బులు ఆదా చేయడంలో భాగంగా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
కరోనా సమయంలో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఆసక్తి చూపించారు. దాంతో, అమెజాన్ ఆన్లైన్లో జేఈఈ పాఠాలు చెప్పడం కోసం 2021 జనవరిలో అమెజాన్ అకాడమీని ప్రారంభించింది. అప్పటికే బైజూస్, అన్ అకాడమీ, టాపర్, వేదాంతు, వైట్హ్యాట్ జూనియర్ వంటి ఎడ్యుటెక్ కంపెనీలు ఉన్నాయి. అందుకని జేఈఈ, నీట్కు సంబంధించి పూర్తి సిలబస్ను చెప్పడం కోసం అమెజాన్ అకాడమీ, శ్రీ చైతన్య విద్యాసంస్థలతో ఒప్పందం కూడా చేసుకుంది.