Rag Mayur | ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సివరపల్లి వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. అదే రోజు విడుదలైన గాంధీ తాత చెట్టు చిత్రానికి కూడా విమర్శలు దక్కాయి. అయితే ఈ రెండింటిలోనూ నటించిన ఓ కుర్రాడు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. అతనే రాగ్ మయూర్. ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ లో హీరోగా, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్గా రెండు భిన్న పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు రాగ్ మయూర్.
బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో భిన్నమైన స్క్రిప్ట్లను ఎంచుకుంటూ దూసుకు వెళ్తున్నాడు రాగ్ మయూర్. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ ప్రశాంతంగా చదువు పూర్తి చేసి తర్వాత నటన మీద శ్రద్ధ పెట్టాడు.. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి నటనతో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిజానికి రాగ్ మయూర్ సినిమా బండి అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో మరిడేశ్ బాబు అనే పాత్రతో ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటన, కామిక్ టైమింగ్, నేచురల్ గా అనిపించగా సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి.
Rag Mayur1
ఇక ఆ తర్వాత రాగ్ మయూర్ భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. అందులో భాగంగానే కీడా కోలా అనే సినిమాలో లాయర్గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ రాగ్ మయూర్ ఆకట్టుకుంటున్నాడు.
ఇటీవల రిలీజ్ అయిన సివరపల్లి సిరీస్ లో అసలు ఏమాత్రం ఉద్యోగం ఇష్టం లేకుండా చేసే పంచాయితీ సెక్రటరీ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. మరోపక్క గాంధీతాత చెట్టు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు దక్కించుకున్నాడు. భవిష్యత్తులో సినిమా బండి దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ‘పరదా’ సినిమాతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘గరివిడి లక్ష్మి’ అలాగే ఇంకా పేరు ఫిక్స్ చేయని గీతా ఆర్ట్స్ 2 సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నాడు.