మంచి కథల మీద దృష్టిపెట్టకుండా సినిమా మార్కెటింగ్కు ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం వల్ల ప్రతిభా పాటవాలు మరుగున పడిపోతున్నాయని వ్యాఖ్యానించింది కథానాయిక యామీ గౌతమ్. ఇటీవల విడుదలైన ‘ఓ మై గాడ్-2’ చిత్రంలో ఆమె పోషించిన లాయర్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా సోషల్మీడియాలో అభిమానులతో ముచ్చటించిన యామీ గౌతమ్..బాలీవుడ్ చిత్రసీమలోని మార్కెటింగ్ కల్చర్పై విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘కొందరు ఓవర్నైట్లో సక్సెస్ సాధిస్తారు. మరికొందరు ఏళ్ల తరబడి కష్టపడుతూ గుర్తింపును తెచ్చుకుంటారు.
వీరందరి కంటే భిన్నంగా కొందరేమో కేవలం మార్కెటింగ్ను నమ్ముకొని విజయాలు సాధించాలని కోరుకుంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేరు. వైవిధ్యమైన కథలు, పాత్రలపై దృష్టిపెట్టకుండా కేవలం మార్కెటింగ్ ద్వారానే పాపులర్ అయిపోదామనే ధోరణి బాగా పెరిగిపోయింది. వ్యక్తిగతంగా నేను మార్కెటింగ్ సంస్కృతికి చాలా దూరంగా ఉంటాను. ఓ వ్యూహం ప్రకారం చేసే ప్రచారం నాకు అస్సలు నచ్చదు. ప్రతిభను నమ్ముకొని కష్టపడి పని చేస్తే చాలు ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని నమ్ముతాను’ అని చెప్పింది. విక్కీ డోనార్, యాక్షన్ జాక్సన్, యురీ వంటి చిత్రాల ద్వారా ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపును సంపాదించుకుంది యామీ గౌతమ్.