Nayanthara | అడవి మొత్తం అంటుకోడానికి చిన్న నిప్పురవ్వ చాలు అన్నట్టు.. సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోవడానికి చిన్న రీజన్ చాలు. అలాంటిది చాలా పెద్ద రీజన్ ఇచ్చింది నయనతార. ఉన్నట్టుండి తన భర్త విగ్నేశ్ శివన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను అన్ ఫాలో చేయడంతో అసలు రచ్చ మొదలైంది. దానికి తోడు ఉబికి వస్తున్న కన్నీళ్లు మాత్రమే ఆమెకు సొంతం అంటూ ఒక ఇంగ్లీష్ కొటేషన్ కూడా పెట్టడంతో.. నయనతార విడాకుల వైపు అడుగులు వేస్తుందని సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. అసలే నయనతార జీవితంలో రెండుసార్లు ప్రేమ గెలిచినట్టే గెలిచి ఓడిపోయింది. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. చివరికి ఎలాగోలా ఐదు సంవత్సరాల డేటింగ్ తర్వాత దర్శకుడు విగ్నేశ్ శివన్తో మూడు ముళ్లు వేయించుకున్న నయనతార.. కవల పిల్లలకు తల్లి కూడా అయింది.
అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్న సమయంలో.. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో రేగిన తుఫాన్ చూసి నయనతార అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కొంపదీసి నిజంగానే ఇద్దరూ విడిపోతున్నారా ఏంటనే అనుమానాలు కూడా బలంగానే వచ్చాయి. అయితే అలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా విగ్నేశ్ వెంటనే స్పందించాడు. అదేదో టెక్నికల్ సమస్య వల్ల నయనతార తన భర్తను అన్ ఫాలో చేసింది అంటున్నారు విశ్లేషకులు. అందుకే మూడు నాలుగు గంటల తర్వాత మళ్లీ ఆటోమేటిక్గా ఫాలో అయిపోయింది నయనతార. అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఆ ఇంగ్లీష్ కొటేషన్ మాట ఏంటి అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. దీనికి అర్థం కేవలం నయనతర మాత్రమే చెప్పాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా విగ్నేశ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా భార్య నయనతార ఫొటోలను విడుదల చేశాడు. దీన్నిబట్టి ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు అంటూ చెప్పకనే చెప్పాడు విగ్నేశ్. వీళ్ల మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే.. గత 24 గంటలుగా నయనతార, విగ్నేశ్ పేర్లతో సోషల్ మీడియా ఊగిపోతుంది. గతంలో సమంత, నిహారిక లాంటి వాళ్లు కూడా విడాకులకు ముందు ఇలాగే తమ మాజీ భర్తలను అన్ఫాలో చేశారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు నయనతార కూడా అదే బాటలో వెళ్తుంది అంటూ చాలామంది అనుకుంటున్న తరుణంలో.. అదేం లేదు తాము ఇద్దరం చాలా ఆనందంగా ఉన్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు విగ్నేశ్ శివన్. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలమైన నయనతార మూడోసారి విజయం సాధించింది. అది జీవితాంతం అలాగే ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారు.