తమిళ ప్రేక్షకులు పొంగళ్ కానుకగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ (Vijay) నటించిన వారిసు (varisu) , అజిత్ కుమార్ నటించిన తునివు జనవరి 11న విడుదలయ్యాయి. తమిళనాడులో ఈ రెండు చిత్రాలకు మంచి టాక్ వస్తుందని ట్రేడ్ సర్కిల్ టాక్. కాగా ఓపెనింగ్స్ విషయంలో వారిసు కంటే హెచ్ వినోథ్ డైరెక్షన్లో వచ్చిన తునివు ముందంజలో ఉందని కలెక్షన్లు చెబుతున్నాయి.
విజయ్ను బీట్ చేసిన అజిత్..
హీస్ట్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన తునివు (thunivu)రూ.19-21 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టిందని ట్రేడ్ సర్కిల్ టాక్. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం వారిసు తమిళనాడులో రూ.17 కోట్లు వసూలు చేసింది. ఇది తునివుతో పోలిస్తే తక్కువే. తునివు చాలా ప్రాంతాల్లో హౌస్ఫుల్ షోలతో స్క్రీనింగ్ అవగా.. తమిళనాడులో మార్నింగ్ షోలు 95 శాతానికిపైగా ఆక్యుపెన్సీతో షురూ అయినట్టు సమాచారం.
రాధ అనే గ్యాంగ్స్టర్ టీం చెన్నైలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకదాన్ని దోచుకునేందుకు ప్లాన్ చేస్తారు. వారి ప్లాన్ సక్సెస్ అయ్యిందా..? లేదా..? స్టోరీతో సాగే సినిమాను మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తుండగా.. రాబోయే రోజుల్లో కూడా ఈ స్పందన ఇలాగే ఉంటుందా.. అనేది చూడాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరోవైపు వారిసు కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనేది కూడా చూడాలి.
తునివు చిత్రంలో మలయాళ భామ మంజు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. జీస్టూడియోస్తో కలిసి బోనీకపూర్ నిర్మించారు. సంజయ్ దత్, సముద్రఖని, మహానంది శంకర్ కీలక పాత్రలు పోషించారు.
వారిసులో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ కీ రోల్స్ లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. వారసుడు (వారిసు తెలుగు వెర్షన్) జనవరి 14న విడుదల కానుంది.