‘చిన్నతనం నుంచి శివానీ, శివాత్మికలను స్కూల్కు పంపించడం కంటే నా షూటింగ్లకు ఎక్కువగా తీసుకెళ్లేవాణ్ణి . సినిమాల వల్ల చదువులకు ఆటంకం రాకూడదని నా కూతుళ్ల కోసం సొంతంగా పాఠశాల ప్రారంభించా’ అని అన్నారు రాజశేఖర్. ఆయన తనయ శివానీ కథానాయికగా పరిచయమైన చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా నటించారు. మల్లిక్రామ్ దర్శకుడు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ‘మా పిల్లలను సొంత బ్యానర్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నాం. కానీ ఆ అవకాశం మాకు ఇవ్వకుండానే ‘అద్భుతం’ సినిమాతో శివానీ, ‘దొరసాని’తో శివాత్మిక మంచి పేరుతెచ్చుకున్నారు. తల్లిదండ్రులుగా మమ్మల్ని గర్వపడేలా చేశారు. ‘శేఖర్’ సినిమాలో శివానీ అతిథి పాత్రలో నటిస్తున్నది’ అని తెలిపారు. జీవిత మాట్లాడుతూ ‘శివానీ, శివాత్మికలకు సినిమాలంటే చాలా ఇష్టం. వారి కలలకు అడ్డుచెప్పకుండా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. కష్టపడి ఇండస్ట్రీలో ఎదగమని, ఫలితం ఏదైనా నిరుత్సాహపడవొద్దని సలహా ఇచ్చాం. ఎన్ని డబ్బులు ఉన్నా సక్సెస్ను కొనలేమని నేర్పించాం. మేము చెప్పిన మాటల్ని ఆచరిస్తున్నారు. ‘అద్భుతం’ చిత్రానికి మంచి స్పందన లభిస్తుండటం సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మంది ఫోన్ చేసి శివానీ నటన బాగుందని అభినందిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకుల తర్వాత వచ్చిన ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని శివానీ చెప్పింది. కథానాయికగా పరిచయం కావాలనే శివానీ ఆరేళ్ల కల ఈ సినిమాతో నిజం కావడం ఆనందంగా ఉందని శివాత్మిక తెలిపింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీభూపాల, మల్లిక్రామ్ పాల్గొన్నారు.