WAR 2 | బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ వార్ 2 ,ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, YRF సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల పవర్ఫుల్ కాంబినేషన్, యాక్షన్ మోడ్, మాస్ అప్పీల్తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో యారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అయితే హైదరాబాద్లో మూవీకి సంబంధించిన పెద్ద ఈవెంట్ ఒక్కటి కూడా జరగకపోవడంతో ఈ రోజు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్.
ఆగస్ట్ 10, ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా జరపనున్నట్టు మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు.. ఓపెన్ గ్రౌండ్లో, పెద్ద సంఖ్యలో అభిమానుల సమక్షంలో ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఎన్టీఆర్కి ఇది మొదటి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ ఉత్సాహం నెలకొంది. అయితే గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో రోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడూ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఈ రోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. దీంతో ఓపెన్ గ్రౌండ్లో ఈవెంట్ నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు,హృతిక్ రోషన్, కియారా అద్వానీ ఈవెంట్కి హాజరవుతారా లేదా అన్నదానిపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. వాతావరణ పరిస్థితులను బట్టి, కార్యక్రమంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే వర్షం వస్తే, ఈవెంట్ వాయిదా పడుతుందా? లేక వేరే లోకేషన్కు మారుస్తారా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి.