Vishwambara | మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్లలో ఒకటి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సినిమా ప్రకటించిన రోజే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘బింబిసార’తో విజయం సాధించిన వశిష్ఠ దర్శకత్వం, ఫాంటసీ అడ్వెంచర్ జానర్, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించడం వంటి అంశాలు అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని పెంచాయి.అయితే, సినిమా టీజర్ విడుదలైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా టీజర్లో కనిపించిన విజువల్ ఎఫెక్ట్స్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విజువల్స్ ఆశించిన స్థాయిలో లేవంటూ అభిమానులు, నెటిజన్లు ట్రోల్ చేయడంతో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.
టీజర్కు వచ్చిన స్పందనను పరిగణనలోకి తీసుకున్న మేకర్స్, విజువల్ ఎఫెక్ట్స్పై మళ్లీ విస్తృత స్థాయిలో పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రేక్షకులకు అత్యుత్తమ విజువల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే పూర్తి చేసిన అనేక VFX షాట్లను తిరిగి మెరుగుపరిచినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ కారణంగానే సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల పదేపదే వాయిదా పడిందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు ఏడాది క్రితమే పూర్తయిందని వార్తలు వచ్చినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, ఆ కొత్త VFX సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు సినిమాలో ఒక కొత్త ఎపిసోడ్ను జోడించాలని దర్శకుడు వశిష్ఠ భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం చిరంజీవితో మరో చిన్న షెడ్యూల్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ సుమారు వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీ రూపొందిస్తున్న కొత్త కమర్షియల్ ఎంటర్టైనర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఆ సినిమా షెడ్యూల్కు ఎలాంటి అంతరాయం కలగకుండా, మధ్యలో కొద్ది రోజులు కేటాయించి ‘విశ్వంభర’కు సంబంధించిన ఈ అదనపు చిత్రీకరణ పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
కొత్తగా చిత్రీకరించే ఈ సన్నివేశాలు పూర్తయిన తర్వాత వెంటనే వాటికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులను కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తయితే ‘విశ్వంభర’ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. అయితే విడుదల తేదీని ప్రకటించే ముందు సినిమా VFX పనులు పూర్తిగా సంతృప్తికరంగా ఉండాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.