‘ఫంకీ’ చిత్రం రెండున్నర గంటల పాటు నాన్స్టాప్గా నవ్విస్తుందని, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించేలా ఉంటుందని చెప్పారు హీరో విశ్వక్సేన్. ఆయన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కయాదు లోహర్ కథానాయికగా నటించింది. శనివారం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు కేవీ అనుదీప్ తనదైన శైలి హాస్యంతో నవ్వించారు. సినీ దర్శకుడి కోమల్ పాత్రలో విశ్వక్సేన్ పంచిన కామెడీ హైలైట్గా నిలిచింది.
ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ..ఇదొక నాన్స్టాప్ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులు ఫోన్ వైపు చూడాలనే ఆలోచన కూడా రాదని, ప్రతీ సన్నివేశం నవ్విస్తుందన్నారు. ‘జాతి రత్నాలు’ రేంజ్ వినోదం ఈ సినిమాలో కూడా ఉంటుందని, ఆద్యంతం పంచ్లు, వ్యంగ్యంతో మెప్పిస్తుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ప్రేక్షకుల్ని వందశాతం నవ్వించే సినిమా ఇదని దర్శకుడు అనుదీప్ కేవీ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ సారంగం, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: అనుదీప్ కేవీ.