‘దర్శకుడు విద్యాధర్ ‘గామి’ కోసం చాలా రీసెర్చ్ చేశాడు. ప్రతి ఎలిమెంట్నీ లోతుగా అధ్యయనం చేసి రాసుకున్నాడు. దాదాపు నాలుగున్నరేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. ఇంత సమయం తీసుకున్నాం కాబట్టే మంచి సీజీని రాబట్టుకోగలిగాం.’ అన్నారు హీరో విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గామి’. కార్తీక్ శబరీశ్ నిర్మాత.
మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వసేన్ మాట్లాడారు. ‘వారణాసిలో ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ‘ఫలక్నామా దాస్’ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడ్ని. ఈ నాలుగున్నరేళ్లలో చాలా సినిమాలు చేసేశాను. నా కెరీర్లో ఇది స్పెషల్ మూవీ. కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ చేశాం. కొందరు నేను అఘోర అనుకొని ధర్మం చేశారు.
వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూలన కూర్చున్నప్పుడు ఓ ముసలామె భోజనం పెట్టి టీ ఇచ్చింది. ఇలా ఎన్నో అనుభవాలు. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. సినిమా కూడా నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు విశ్వక్సేన్. మానవస్పర్శే సమస్యగా మారిన ఓ అఘోరా హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ఈ సినిమా అని, అఘోర శంకర్గా ఇందులో విశ్వక్సేన్ అద్భుతంగా నటించాడని దర్శకుడు విద్యాధర్ చెప్పారు. ఇంకా నిర్మాత కూడా మాట్లాడారు. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నరేశ్ కుమారన్, కెమెరా: విశ్వనాథ్రెడ్డి.