‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ‘ఫంకీ’ సినిమా చూడండి. రెండు గంటలు ఎలా అయిపోయాయో కూడా తెలియనంతగా సినిమా వినోదాన్ని పంచుతుంది. ఇది నేను నమ్మకంతో చెబుతున్న మాట. నా గత రెండు చిత్రాల్లో పాటలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. కానీ ఈ సినిమాలో భీమ్స్ అద్భుతమైన పాటలిచ్చారు. ఇక దర్శకుడు అనుదీప్ యువత మెచ్చేలా సినిమాను మలిచాడు. తప్పక విజయం సాధించే సినిమా ఇది’ అని విశ్వక్సేన్ అన్నారు.
ఆయన కథానాయకుడిగా రూపొందిన యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. కయాదు లోహర్ కథానాయిక. కె.వి.అనుదీప్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ప్రెస్మీట్లో విశ్వక్సేన్ మాట్లాడారు.
కథపై నమ్మకంతో సినిమా చేయడానికి అంగీకరించిన విశ్వక్సేన్కీ, నిర్మాత నాగవంశీకీ కృతజ్ఞతలనీ, సాంకేతికంగా అంతా ఈ సినిమాకు మనసుపెట్టి పనిచేశారని దర్శకుడు అనుదీప్ కె.వి.చెప్పారు. ‘ఓ దర్శకుడు, ఓ నిర్మాత కూతురు మధ్య జరిగే సరదా కథ ఇది. ఆద్యంతం సినీ నేపథ్యంలోనే సాగుతుంది. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా దర్శకుడు అనుదీప్ సినిమాను మలిచారు. అంతా నవ్వుతూ థియేటర్ల నుంచి బయటకొస్తారు’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నమ్మకంగా చెప్పారు. ఇంకా కథానాయిక కయాదు లోహర్ కూడా మాట్లాడారు.