‘ ‘శివ’ సినిమా చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. కానీ అనుకోకుండా హీరో అయ్యాను. దర్శకుడ్ని కావాలనుకున్న నా కల ఇన్నాళ్లకు ‘మకుటం’ రూపంలో నిజమైంది. ఇది సూపర్గుడ్వారి 99వ సినిమా. ఈ సంస్థ నుంచి పరిచయమైన దర్శకుల్లో నేను 45వ వాడ్ని. ఆర్బీ చౌదరి ఈ బాధ్యతను నాకప్పగించారు. ఈ రోజు ఆయన్ను మిస్ అవుతున్నాం. ఈ సినిమా కోసం ఏడాదిపాటు వ్యక్తిగత విషయాలన్నింటినీ పక్కన పెట్టాను. నేను ఇప్పటివరకూ పనిచేసిన దర్శకుల అందరి టెక్నిక్స్ ఇందులో వాడాను. ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. సినిమా గురించి ఎక్కువగా చెప్పను. చూశాక ప్రేక్షకులే చెబుతారు’ అని విశాల్ అన్నారు.
ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన యాక్షన్ డ్రామా ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ కథానాయికలు. స్వర్గీయ ఆర్బీ చౌదరి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ‘నచ్చాకే వచ్చారా.. వెచ్చంగ హత్తుకో.. గుండెల్లో పెట్టుకో..’ అంటూ సాగే ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ హైదరాబాద్లోని నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ పై విధంగా స్పందించారు. ఇందులో ఓ మంచి పవర్ఫుల్ రోల్ పోషించానని, విశాల్ సినిమాను అద్భుతంగా తీశాడని, హీరోగా, దర్శకుడిగా తనకు పెద్ద విజయం దక్కుతుందని అంజలి నమ్మకంగా చెప్పింది. ఇంకా నటులు జితిన్ రమేశ్, అజయ్, నటి ఝాన్సీ, సింగర్ ప్రభ కూడా మాట్లాడారు.