Virosh | సుమారు నెలన్నర క్రితం రాజస్థాన్లో అత్యంత ప్రైవేట్గా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల కోసం కర్ణాటకలోని విరాజ్పేట్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుక కొడవ సంప్రదాయాల నడుమ అద్భుతంగా జరిగి , అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. విరాజ్పేట్లోని ప్రసిద్ధ ‘సెరినిటీ హాల్’లో జరిగిన ఈ రిసెప్షన్లో కొడవ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్మిక మందన్న సంప్రదాయ కొడవ శారీలో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ కూడా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. హాల్ను సంప్రదాయ అలంకరణలతో అలంకరించి, వేడుకకు ప్రత్యేక శోభ తీసుకువచ్చారు.
ఈ స్టార్ జంట వివాహం ఉదయ్పూర్లో అత్యంత సింపుల్గా, హడావుడి లేకుండా జరిగింది. ఆ వేడుకకు హాజరుకాలేని బంధువుల కోసం ఈ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. పెళ్లి తర్వాత నెలన్నర గ్యాప్తో ఈ కార్యక్రమం జరగడం ప్రత్యేకంగా నిలిచింది. రిసెప్షన్కు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కొడగు ఆతిథ్యాన్ని అందిస్తూ, కొత్తల్లుడికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొడవ సంస్కృతి, సంప్రదాయ ఆహార వంటకాలను పరిచయం చేయడం వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. సెలబ్రిటీ కార్యక్రమం కావడంతో ఈ వేడుకను పూర్తిగా ప్రైవేట్గా నిర్వహించారు. కేవలం ఆహ్వానితులకు మాత్రమే అనుమతి ఉండగా, మీడియాకు ఎలాంటి ప్రవేశం లేదని తెలుస్తోంది. ఫంక్షన్ హాల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
పెళ్లి తర్వాత మొదటిసారి పుట్టింటికి వచ్చిన రష్మిక మందన్నకు ఆమె తండ్రి మదన్ మందన్న భారీ కానుక అందించారు. కుటుంబానికి చెందిన ‘సెరినిటీ’ అనే ఇంటిని రష్మిక పేరుపై రిజిస్టర్ చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ గిఫ్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గీత గోవిందం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటై కొత్త జీవితం ప్రారంభించడం అభిమానులను ఆనందపరుస్తోంది.