Visakhapatnam | టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో విజయం సాధించిన సందర్భంగా కోహ్లీ స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఆలయ అధికారులు విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ పురాణ ప్రాధాన్యత కలిగిన కప్ప స్తంభాన్ని ఆయన ఆలింగనం చేసుకున్నారు. దర్శనం పూర్తయ్యాక ఆలయ అర్చకులు కోహ్లీకి వేద ఆశీర్వచనం ఇచ్చి సన్మానించారు. దేవస్థానం అధికారులు కోహ్లీకి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. కోహ్లీతో పాటు భారత జట్టు సభ్యులు లేదా కోచ్ సిబ్బందిలో మరొకరు కూడా స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఇటీవల టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు.