సినిమాటోగ్రఫీ యాక్ట్ సవరణలపై సినీ వర్గాల ఆగ్రహం
సినిమాటోగ్రఫీ చట్టంలో ప్రభుత్వం చేయనున్న సవరణలు భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉన్నాయంటూ సినీ ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. సీబీఎఫ్సీపై కేంద్ర ఆధిపత్యంపై కమల్హాసన్, సూర్యతో పాటు వివిధ భాషలకు చెందిన అగ్రనాయకానాయికలు, సాంకేతిక నిపుణులు నిరసనను వ్యక్తంచేశారు. త్వరలో ప్రవేశపెట్టబోతున్న ఈ కొత్త చట్టాన్ని సినీ ప్రముఖులంతా వ్యతిరేకిస్తుండటంతో ఇందులో ఏముందనే ఆసక్తి అందరిలో మొదలైంది.
సినిమాటోగ్రఫీ యాక్ట్ 1918లో తొలిసారి ప్రవేశపెట్టారు. కాలానుగుణంగా ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్ని నిర్మించే స్థాయికి దేశం ఎదిగినా సెన్సార్షిప్ విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు అలాగే ఉండిపోయాయి. వాటిలో మార్పులు తీసుకొచ్చేందుకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి 2013లో జస్టిస్ ముగ్ధల్, 2016లో శ్యామ్బెనగల్ నేతృత్వంలో రెండు కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ నిర్ధారణ విషయంలో ఈ కమిటీల సూచనల ఆధారంగా సినిమాటోగ్రఫీ యాక్ట్ 2021 ముసాయిదా బిల్లును ప్రభుత్వం సిద్ధంచేసింది. ఈ సవరణలపై ప్రజల అభిప్రాయాలను కోరిన ప్రభుత్వం అందుకు పదిహేను రోజులు గడువు ఇచ్చింది.శుక్రవారంతో ఈ గడువు ముగిసింది. ఈ సూచనల విషయంలో ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని సినీ ప్రముఖులు అంటున్నారు.
సీబీఎఫ్సీ జారిచేసిన సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని చైర్మన్ను ఆదేశించే అధికారం కేంద్రానికే ఉండేలా సవరణలు చేశారు. సినిమా ప్రదర్శనలకు జారీ చేసే యు, యు.ఏ, ఏ. ఎస్ సర్టిఫికెట్స్లో కొన్ని మార్పులు చేశారు. ఇదివరకు ఈ సర్టిఫికేట్ కాలపరిమితి పదేళ్లు ఉండేది. అయితే కొత్త బిల్లులో ఈ కాల పరిమితిని రద్దు చేశారు.యు.ఏ సర్టిఫికెట్లో మార్పులు సూచించింది.
గతంలో తల్లిదండ్రుల అనుమతితో పన్నెండు ఏళ్ల లోపు పిల్లలకు సినిమా చూసే అవకాశం ఉండేది. వాటిని మూడు విభాగాలుగా విభిజించారు.
పైరసీ అడ్డుకోవడానికి ఈ ముసాయిదా బిల్లులో కొన్ని సవరణలు సూచించారు. సినిమా పైరసీకి పాల్పడితే కనిష్టంగా మూడు నెలలు, గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్షతో పాటు మూడు లక్షల జరిమానా విధించనున్నారు. లేదంటే సినిమా నిర్మాణం వ్యయంలో ఐదు శాతం డబ్బును జరిమానాగా చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నది.
వీటిలో కొన్ని సవరణలు బాగానే ఉన్నా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో కేంద్రం జోక్యంపై సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం వల్ల సినిమా రూపకల్పనలో తమ భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోతుందని చెబుతున్నారు. గతంలో సెన్సార్ విషయంలో ఎగ్జామిన్ కమిటీ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్లేవారు. అక్కడ సమస్యలు ఎదురైతే రీ రివైజింగ్ను ఆశ్రయించేవారు. అక్కడ సమస్య పరిష్కారం కానీ పక్షంలో అప్పిలేట్ ట్రిబ్యూనల్ వెళ్లే అవకాశం ఉండేది. గత ఏప్రిల్లో కేంద్రం అప్పిలేట్ ట్రిబ్యునల్ను రద్దు చేసింది. ఇప్పుడు నేరుగా కేంద్రమే జోక్యం చేసుకుంటే సినిమా రూపకల్పన కఠినతరం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత కేంద్రం జోక్యం చేసుకోరాదని 2000 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.కానీ దేశసార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీయడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సినిమాలు ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో కొన్ని సహేతుక ఆంక్షలు ఉండటంలో తప్పులేదని అంటోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొనే సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించబోతున్నట్లుశాంతిభద్రతలు, దేశసార్వభౌమత్వం లాంటి అంశాలను బేరీజు వేసుకొని థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సినిమాపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని సినిమాటోగ్రఫీ ముసాయిదా బిల్లు సూచించింది. ఈ సవరణ కారణంగా అర్ధాంతరంగా సినిమాను నిలిపివేస్తే నిర్మాతలు ఎంతగానో నష్టపోయే అవకాశం ఉందంటూ సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ ముసాయిదా బిల్లులోని సవరణలు అందరికీ ఆమోదయోగ్యంగా లేవని ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఈ వర్షకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తుంది. సినీ ప్రముఖుల అభ్యంతరాల నేపథ్యంలో ఏమైనా వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
దేశంలో సినిమా, మీడియా, లిటరేచర్ మూడుసింబాలిక్ కోతుల్లా ఉండకూడదు. స్వేచ్ఛ కోసం ప్రతి ఒక్కరూ గళమెత్తాలి -కమల్హాసన్
భావప్రకటన స్వేచ్ఛను కాపాడటమే చట్టం పని కాని, దాని గొంతుకోసి చంపడం కాదు. -సూర్య
కొత్త చట్టం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తి ప్రజలు జీవితాల్ని కోల్పోయే సమస్య ఎదురైతే..అందుకు ఫిల్మ్ మేకర్స్ లేదా లా మేకర్స్ ఎవరు బాధ్యత వహిస్తారు. – ప్రణీత