కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. మురళి కిషోర్ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమం తాజాగా హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…‘ఈ సినిమా విజయం పట్ల నిర్మాతగా సంతృప్తిగా ఉన్నాను. నా సినిమాల్లో చాలా త్వరగా పెట్టుబడి తిరిగొచ్చిన చిత్రమిది.
సినిమా కోసం ప్రతి ఒక్క టీమ్ మెంబర్ కష్టపడి పనిచేశారు. కొత్తగా దర్శకత్వం చేయాలనుకునేవారికి ధైర్యాన్నివ్వాలనే ఉద్దేశంతో నాన్ లీనియర్ తరహా కథనంతో సినిమా రూపొందించాం’ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…‘కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. ఇవాళ మా సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోని పెద్దలు ప్రశంసిస్తున్నారు.
సినిమాలో ప్రేమ, కుటుంబం, దేశం గురించి మంచి మాటలు చెప్పాం. ఇలాంటి మంచి చిత్రంలో భాగమయ్యేందుకు అవకాశమిచ్చిన నిర్మాతలకు థాంక్స్’ అన్నారు. నాయిక కశ్మీర మాట్లాడుతూ…‘సినిమా చూశాక అందరూ నన్ను దర్శన అని పిలుస్తున్నారు. నా పాత్రను అంతగా ఆదరించడం సంతోషంగా ఉంది’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.