Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.ఆన్స్క్రీన్లో అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో కూడా దంపతులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. విజయ్–రష్మిక జంట కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ సినిమాల తర్వాత నుంచే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. అభిమానులు కూడా ప్రేమగా ఈ జంటకు “విరోష్” అనే పేరు పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు అభిమానులు వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తారని ఎదురుచూశారు. అయితే ఈ జంట ఎప్పుడూ ఆ విషయంపై స్పష్టంగా మాట్లాడలేదు. కానీ అప్పుడప్పుడు రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు, హింట్లు మాత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచేవి.
చివరకు ఫిబ్రవరి 22, 2026న తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా అభిమానులు పెట్టిన “విరోష్” అనే పేరునే స్వీకరిస్తూ “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” అని ప్రకటించారు. అనంతరం ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు కలిపి సుమారు 100 మంది అతిథుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన మూలాలను మరవకుండా స్వగ్రామానికి వెళ్లడం ప్రత్యేకంగా నిలిచింది. తన భార్య రష్మిక మందన్నతో కలిసి తన స్వగ్రామమైన తుమ్మన్ పేటకు వెళ్లి కొత్తగా నిర్మించిన ఇంటిలో గృహప్రవేశం చేశారు. అనంతరం అక్కడే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
ఇదే సందర్భంలో గ్రామస్తుల కోసం విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి కూడా తమవంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తన స్వగ్రామంలో అందమైన ఇంటిని నిర్మించుకోవడంతో పాటు గ్రామస్తులతో కలిసిపోవడం అందరినీ ఆకట్టుకుంది. స్టార్ హీరో అయినప్పటికీ సాధారణ మనిషిలా అందరితో మమేకమవడం చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, “విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మా ఊరిని మర్చిపోకుండా వివాహం తర్వాత ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ విజయ్ చాలా సాధారణంగా మాతో కలిసిపోవడం మాకు గర్వంగా ఉంది. గీత గోవిందం సినిమాలో ఎలా అందమైన జంటగా కనిపించారో, నిజ జీవితంలో కూడా అలాగే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం” అని ఆశీర్వదించారు. ప్రస్తుతం విరోష్ జంటపై గ్రామస్తులు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అభిమానులు కూడా ఈ జంటపై ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.