Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఖుషీ’. మజిలీ ఫేం శివనిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రచార చిత్రాలను కూడా విడుదల చేసింది. అయితే, తాజాగా ఈ చిత్రం వాయిదా పడినట్లు నటుడు విజయ్ తెలిపారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్… ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఖుషీ సినిమా దాదాపు 60శాతం షూటింగ్ పూర్తి చేశాం. మేము ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేద్దామనుకున్నాం. అయితే, అనుకోని కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. 2023 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం’ అని తెలిపారు.
ఖుషీ చిత్రంలో కన్నడ యాక్టర్ జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ , రోహిణి, లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ-సమంత కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు, మూవీ లవర్స్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.