విజయ్ దేవరకొండ మిక్స్ మార్షల్ ఆర్ట్ ఫైటర్గా కనిపించబోతున్న సినిమా ‘లైగర్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్నారు. అనన్య పాండే నాయికగా నటిస్తున్నది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బోల్డ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై సమంత, అనుష్క శెట్టి సహా పలువురు బాలీవుడ్ తారలు స్పందించారు. ‘ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెల్చుకోవాలని కోరుకుంటున్నా, పూరి మ్యాజిక్ తెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నా. విజయ్కు కెరీర్ బెస్ట్ ఫిలిం కావాలి’ అంటూ అనుష్క శెట్టి స్పందించగా..‘లైగర్ కొత్త పోస్టర్ అదిరింది. విజయ్కు రూల్స్ తెలుసు, వాటిని బ్రేక్ చేయడమూ తెలుసు. సాహసం గల నటుడు’ అని సమంత పోస్ట్ చేసింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘శారీరకంగా, మానసికంగా నేనెంతో శ్రమించి చేసిన చిత్రమిది. నటుడిగా నాకు సవాలు విసిరిందీ పాత్ర’ అన్నారు. రమ్యకృష్ణ, మైక్ టైసన్, రోనీ రాయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.