నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘తండేల్’ చిత్రం శనివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో వెంకటేష్ క్లాప్నివ్వగా, నాగార్జున కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఏడాదిన్నరకుపైగా ఈ కథపై వర్క్ చేశాం.
యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. ఎక్కువ భాగం ఒరిజినల్ లోకేషన్లలో షూటింగ్ జరుపుతాం’ అన్నారు. ‘ఈ కథను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి చూపించాలి. ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రీప్రొడక్షన్ సమయంలో ప్రతీ విషయాన్ని కూలంకషంగా చర్చించాం. ఇలాంటి సినిమా తీయాలి కదా అని మా అందరికి ఉత్సాహాన్నిచ్చింది ఈ కథ.’ అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
నాగచైతన్య మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశాను. అక్కడి యాసపై కూడా వర్కవుట్ చేశా. ఏ సినిమాకు ఇంతటి ప్లానింగ్తో ముందుకెళ్లలేదు. నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా ఇది’ అన్నారు. ఎంతో రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశామని, ఈ సినిమా కోసం నాగచైతన్య తనని తాను అద్భుతంగా మలచుకున్నాడని, గీతా ఆర్ట్స్ సంస్థలో చాలా ప్రత్యేకత కలిగిన చిత్రమిదని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: నవీన్నూలి, ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.