ఆమె గళం… ప్రతి ఎదను మీటి సుస్వరాల విరిజల్లుల్ని కురిపిస్తుంది. ఆ అమృతగానపు మాధుర్యం అమితానందంతో అంబరాన్ని తాకుతుంది. తెలిమంచు తెరల చల్లని పలకరింపులా అలసి సొలసిన హృదయాలకు సాంత్వన చేకూర్చుతుంది. ఆ స్వర రసవాహినిలో పులకించని తనువుండదు. ఆమె ప్రతి పలుకు తేనెలూరించే ఓ రసగుళిక. తన సుమధుర గాత్రంతో మూడు తరాలను రంజింపజేసింది వాణీ జయరామ్. ఆమె సంగీత ప్రయాణంలో కొన్ని వేల పాటలు. ప్రతీ పాట ఓ ఆణిముత్యమే. దొరకునా ఇటువంటి స్వరం అంటూ సంగీత ప్రియులు వేనోళ్ల పొగిడిన ఆ అమృతగళం శాశ్వతంగా మూగబోయి దిగంతాలకు ఎగసింది.
సినీ సంగీత ప్రపంచం మరో దిగ్గజ గాయనిని కోల్పోయింది. ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (77) చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడులోని వెల్లూరులో 1945, నవంబర్ 30న ఆమె జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. తెలుగు సహా కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తులు, బెంగాళీ, హర్యాణి, హిందీ ఇలా మొత్తం 14 భాషల్లో దాదాపు 10 వేల పాటలను ఆలపించారు. వందలాది భక్తి గీతాల ప్రైవేట్ ఆల్బమ్స్ ఆలపించారు. ఇటీవల ఆమెకు కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. జాతీయ ఉత్తమ గాయనిగా మూడు సార్లు పురస్కారాలు అందుకున్నారు వాణీ జయరాం. తమిళంలో ‘అపూర్వ రాగాంగల్’, తెలుగులో ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’ చిత్రాలకు ఆమెకు జాతీయ పురస్కారాలు దక్కాయి. ‘శంకరాభరణం’లో ‘మానస సంచరరే, ‘స్వాతికిరణం’ చిత్రంలో ‘ఆనతినీయరా హరా..’ పాటలకు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు పొందారు.
వాణీ పాడిన కొన్ని మధురగీతాలు
ఇల్లే సంగీతాలయం
వాణీ జయరాం తండ్రి దురైసామి అయ్యంగార్, తల్లి పద్మావతి. తొమ్మిది మంది పిల్లలున్న పెద్ద కుటుంబం వారిది. ఆరుగురు ఆడపిల్లల్లో ఐదో బిడ్డగా వాణీ జయరాం జన్మించారు. ఆమె తల్లి పద్మావతి వీణ విద్వాంసురాలు. చిన్నతనం నుంచే ఆమె ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. బాల్యంలోనే కర్నాటక సంగీతం నేర్చుకున్నారు. 8 ఏండ్లకే ఆలిండియా రేడియోలో పాటలు పాడారు. ఈ ప్రదర్శన ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మద్రాస్ క్వీన్స్ మేరీ కాలేజ్ నుంచి పట్టభద్రురాలైన వాణీ జయరాం కొన్నేళ్లు బ్యాంక్లో ఉద్యోగం చేశారు. బదిలీ మీద మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చారు.
భర్త ప్రోత్సాహంతో
1969లో జయరాంతో వాణీ వివాహం జరిగింది. ఆ తర్వాత ముంబైకి నివాసం మార్చారు. పాటలు పాడటంలో సతీమణి ప్రతిభ తెలిసిన జయరాం ఆమెకు హిందూస్తానీ క్లాసిక్ మ్యూజిక్లో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ముంబైలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె ప్రతిభ గమనించిన సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ మరాఠీ ఆల్బమ్లో ‘రుణానుబంధాచ’ అనే పాట పాడించారు. ఇదే వాణీ జయరాం రికార్డ్ చేసిన తొలి పాట. ఈ పాటకు మంచి ఆదరణ లభించడంతో ఆమెకు అవకాశాలు వరుస కట్టాయి. ప్రాంతీయ భాషల్లోనూ అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఈ దంపతులకు సంతానం లేరు. 2018లో జయరాం కన్నుమూశారు.
తెలుగు పాట ప్రత్యేకం
తన కెరీర్లో తెలుగు పాట ఎంతో ప్రత్యేకమని చెప్పుకునేవారు వాణీ జయరాం. 1973లో ఎస్పీ కోదండపాణి స్వరపర్చిన ‘అభిమానవంతులు’ చిత్రంతో ఆమె తెలుగు శ్రోతలకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ‘ఇప్పటివలె కాదురా నా స్వామి’ పాట ఆమె పాడిన తొలి తెలుగు పాట. 1975లో విడుదలైన ‘పూజ’ సినిమా వాణీ జయరాంకు పాపులారిటీ తీసుకొచ్చింది. ఈ చిత్రంలోని ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’ పెద్ద హిట్ అయ్యింది. కె. విశ్వనాథ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’లో బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవ, మానస సంచరరే, పలుకే బంగారమాయెనా, ఏ తీరుగ నను వంటి పాటలు శ్రోతల మనసు గెల్చుకున్నాయి. ఈ చిత్రంలోని ‘మానస సంచరరే’ పాటకు ఆమెకు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం దక్కింది. ‘స్వాతికిరణం’ చిత్రంలోని ‘ఆనతినీయరా హరా’ పాటకు మరోసారి జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికైంది. ‘మరో చరిత్ర’, ‘సీతాకోకచిలుక’, ‘సీతామాలక్ష్మి’, ‘మంగమ్మగారి మనవడు’, ‘సంకీర్తన’, ‘ఘర్షణ’ వంటి చిత్రాల్లోని ఎన్నెన్నో మరపురాని పాటలు ఆమె గాన మధురిమను పంచాయి. ఈ ఏడాది కళారంగంలో చేసిన సేవకు వాణీ జయరాంకు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
వైవిధ్యభరితం ఆమె గాత్రం
ఏ తరహా పాటనైనా పాడగల సత్తా గల గాయనిగా సంగీత దర్శకుల మెప్పుపొందారు వాణీ జయరాం. తెలుగులో ఇళయరాజా, కేవీ మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు వాణీ జయరాంకు బాగా పేరు తీసుకొచ్చాయి. ఎంతటి క్లిష్టమైన పాటలైనా ఆమె శ్రోతలను ఆకట్టుకునేలా పాడేవారు. కర్నాటక, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతాల్లో శిక్షణ పొందడం, సంప్రదాయ సంగీతంలో అవగాహన ఉండటం వాణీ జయరాంకు ఎలాంటి పాటనైనా పాడే నేర్పు అందించింది. ఒక బృందావనం సోయగం అంటూ పాడినా…బ్రోచేవారెవరురా అని గొంతెత్తినా, శ్రీ సూర్య నారాయణా మేలుకో అని ఆలపించినా ఆమె గళం నుంచి మధుర గీతాలు వెల్లువెత్తాయి. 14 భాషల్లో వేలాది వైవిధ్యమైన పాటలు పాడటం ఆమె ప్రతిభకు, బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం.
రహస్యంగా పాటలు వింటూ..
వాణీ జయరాం శాస్త్రీయ సంగీత కుటుంబ నేపథ్యం నుంచి రావడంతో ఆమె ఇంట్లో సినిమా పాటలపై పూర్తి నిషేధం ఉండేది. అలాంటి వాతావరణంలో సినీ గీతాలపై మక్కువ పెంచుకుంది వాణీ జయరాం. రేడియోలో తక్కువ సౌండ్ పెట్టుకొని రహస్యంగా పాటలు వినేది. జనరంజకమైన సినీ గీతాల్ని వింటూ ‘ఎప్పటికైనా సినిమాల్లో పాటలు పాడాలి’ అనే బలమైన నిర్ణయానికొచ్చింది. పెళ్లి తర్వాతే తన సంగీత ప్రయాణం మలుపు తిరిగిందని చాలా సందర్భాల్లో చెప్పింది వాణీ జయరాం. భర్తతో కలిసి ముంబయికి చేరుకున్న తర్వాత పండిట్ రవిశంకర్ దగ్గర ఆరేళ్లపాటు కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది వాణీ జయరాం. ప్రతి రోజు 18 గంటల పాటు సాధన చేస్తూ ప్రావీణ్యం సంపాదించింది. ఉస్తాద్ అబ్దుల్ రహమాన్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని సాధన చేసింది.
సంగీత ప్రపంచానికి తీరని లోటు
ప్రముఖ గాయని, పద్మభూషణ్ శ్రీమతి వాణీ జయరాం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె 14 భాషల్లో వేలాది పాటలు పాడి శ్రోతలను అలరించారు. సినీ రంగానికి వాణీ జయరాం చేసిన సేవలు మర్చిపోలేనివి. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
– ముఖ్యమంత్రి కేసీఆర్
విషాద వార్త నమ్మలేకపోతున్నా
దిగ్గజ గాయని వాణీ జయరామ్ మృతి వార్తను నమ్మలేకపోతున్నా. కొద్ది రోజుల క్రితమే ఆమెతో మాట్లాడాను. బలమైన సంప్రదాయ సంగీత ప్రతిభతో బహు భాషల్లో పాటలు పాడి మెప్పించిన గొప్ప గాయని వాణీ జయరాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
– గాయని చిత్ర
శ్రోతలను అమితంగా మెప్పించారు
ప్రముఖ గాయని వాణీ జయరామ్ గారు మృతిచెందడం బాధాకరం. తెలుగుతో పాటు పలు భాషల్లో ఆమె పాడిన పాటలు శ్రోతలను అమితంగా ఆకట్టుకున్నాయి. ‘శంకరాభరణం’ చిత్రంలోని పాటలను ఎప్పటికీ మరువలేం. ఇటీవల పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆమె ఆ అవార్డ్ తీసుకోకుండానే కన్నుమూయడం విచారకరం.
– పవన్ కళ్యాణ్