బాలీవుడ్ సీనియర్ కథానాయిక మాధురి దీక్షిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత దీక్షిత్ (91) ఆదివారం ముంబయిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని మాధురి దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఓ ప్రకటనలో తెలియజేశారు. స్నేహలత దీక్షిత్ అంత్యక్రియలు వర్లీలోని శ్మశాన వాటికలో నిర్వహించారు. తన సినీ ప్రస్థానంతో పాటు వ్యక్తిగత ఉన్నతిలో తల్లి స్నేహలత దీక్షిత్ గొప్ప పాత్ర పోషించిందని మాధురి దీక్షిత్ చాలా సందర్భాల్లో గుర్తుచేసుకుంది.
గత ఏడాది జూన్లో తల్లి జన్మదినం సందర్భంగా ఆమెతో కలిసి తీయించుకున్న పలు ఫొటోల్ని తన సోషల్మీడియా ఖాతాలో పంచుకుంది మాధురి దీక్షిత్. ‘నువ్వు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. గొప్ప మార్గదర్శిలా నిలిచావు’ అని మాధురి దీక్షిత్ పేర్కొంది. స్నేహలత దీక్షిత్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.