Venkatesh | విక్టరీ వెంకటేష్ కెరీర్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. అప్పటివరకు 100 కోట్ల క్లబ్ను కూడా టచ్ చేయని వెంకీ, ఒక్కసారిగా ఇంత భారీ విజయం సాధించడంతో ఆయన స్టార్డమ్ ఒక్కసారిగా రెట్టింపు అయింది. గత సంక్రాంతి మొత్తం వెంకటేష్ గురించిన చర్చే సాగింది.ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా వెంకీ అభిమానులకు మరో ప్రత్యేక ట్రీట్ సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తొలుత గెస్ట్ రోల్గా అనుకున్న ఈ పాత్రను చిరంజీవి సూచనతో దర్శకుడు అనీల్ రావిపూడి పూర్తి స్థాయి కీలక పాత్రగా మలిచారు. దాదాపు 20 నిమిషాల నిడివితో డిజైన్ చేసిన ఈ పాత్ర సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం.
చిరంజీవి–వెంకటేష్ కాంబినేషన్లో ఒక ప్రత్యేకమైన సాంగ్ కూడా ఉండనుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ ట్రాక్తో పాటు మాస్ మసాలా సాంగ్లో ఇద్దరూ కలిసి స్టెప్పులు వేయనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ విధంగా వరుసగా రెండు సంక్రాంతుల్లో వెంకటేష్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, వెంకటేష్ కొత్త సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభమైంది. ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలిసారి వెంకటేష్తో త్రివిక్రమ్ పని చేయడం, అలాగే ‘మల్లీశ్వరి’ వంటి చిత్రానికి రచయితగా ఉన్న త్రివిక్రమ్ హస్తం ఇందులో ఉండటం ఈ ప్రాజెక్ట్కు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ సినిమా 2026 ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు, సూపర్ హిట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి పార్ట్ 3కు కూడా రంగం సిద్ధమవుతోంది. మలయాళంలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఇప్పటికే ‘దృశ్యం 3’ షూటింగ్ పూర్తి చేయగా, బాలీవుడ్ వెర్షన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ‘దృశ్యం 3’పై ఆసక్తి పెరుగుతోంది. మలయాళ వెర్షన్ నుంచి జీతూ జోసెఫ్ రిలీవ్ అయిన తర్వాత తెలుగు వెర్షన్పై కొత్త అప్డేట్ కొత్త ఏడాదిలో వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే ‘దృశ్యం’ సిరీస్లో వచ్చిన రెండు భాగాలు భారీ విజయం సాధించాయి. ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రెండో భాగం కోవిడ్ కారణంగా థియేటర్లకు రాకపోయినా, ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వెంకటేష్ నుంచి రాబోయే సినిమాలు ఆయన కెరీర్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లనున్నాయనే అంచనాలు బలంగా ఉన్నాయి.