శింబు, సిద్ధీ ఇద్నానీ జంటగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో అనువాదమవుతున్నది. శ్రీస్రవంతి మూవీస్ తెలుగులో ఈ నెల 17న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ…‘శింబూ నేను కలిసి గతంలో చేసిన రొమాంటిక్ చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. ఒక చిన్న పల్లెలో జీవించే ముత్తు అనే వ్యక్తి కొన్ని కారణాల వల్ల ముంబై వెళ్తాడు. అక్కడ అతను చీకటి ప్రపంచంలోకి ఎలా వెళ్లాడు, ఆ తర్వాత ఏమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ముత్తు జీవితంలోని ప్రేమ, రొమాన్స్ సినిమాలో మరో భాగం.
ఆ గ్యాంగ్స్టర్ లైఫ్ నుంచి కథానాయకుడు ఎలా బయటపడ్డాడు అనేది ముగింపుగా చూపిస్తున్నాం. ఓటీటీలు వచ్చాక ప్రపంచంతో పాటు సినిమా కూడా బాగా దగ్గరైంది. సినిమాకు భాష లేదు అనేది నా అభిప్రాయం. ఈ చిత్రంలో కూడా కొన్ని పాత్రలు హిందీలో మాట్లాడుతాయి. అయితే ప్రేక్షకులు వాటి భావోద్వేగాలకు కనెక్ట్ అవుతారు.
హీరో రామ్తో ఒక సినిమా చేయబోతున్నాను. వచ్చే ఏడాది ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాం. విక్రమ్తో రూపొందిస్తున్న ‘ధృవనక్షత్రం’ సినిమా ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నాగ చైతన్యతో ‘ఏమాయ చేసావే 2’, వెంకటేష్ గారితో ‘ఘర్షణ 2’ చిత్రాలు చేయాలని ఉంది. వారు ఒప్పుకుంటే కథలు రెడీ చేస్తా’ అన్నారు.