‘అఖండ’ తరువాత అలాంటి మరో సినిమాని ప్రేక్షకులు ఆశిస్తారు. అందుకే ‘వీరసింహా రెడ్డి’ లాంటి పవర్ఫుల్ కథతో సినిమా చేశాం. ఈ కథకు ప్రతిభావంతమైన దర్శకుడు, సంగీతం, మాటలు, ఫైట్స్ ఇలా అన్ని కుదిరాయి. అందరి సమిష్టికృష్టితో రూపొందిన ఈ సినిమాకి నేడు ప్రేక్షకులు అద్భుత విజయాన్ని అందించారు’ అన్నారు అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీస్ సంస్థ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్లు నిర్మించిన చిత్రం ‘వీరసింహా రెడ్డి’ ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్మీట్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’రూపంలో విందుభోజనం లాంటి సినిమాను అందించాం. దర్శకుడు గోపీచంద్ మలినేని అందరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు.
సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లో అన్నాచెల్లెలు మధ్య సన్నివేశాలు చూస్తుంటే మహిళా ప్రేక్షకులే కాదు మగవాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘బాలకృష్ణ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఓ అభిమానిగా, దర్శకునిగా సద్వినియోగపరుచుకున్నాను. బ్లాక్బస్టర్ సినిమా చేయాలనే కంకణం కట్టుకుని బాధ్యతగా సినిమా చేశాను. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో గర్వంగా వుంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మేము ఊహించిన దాని కంటే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా ఈ చిత్రం నిలిచింది. రికార్డు కలెక్షన్స్తో.. అద్బుతమైన టాక్తో సినిమా హిట్ కావడం ఆనందంగా వుంది. ప్రేక్షకులు , అభిమానులు బాలకృష్ణ విశ్వరూపం చూశామని అంటున్నారు. బాలకృష్ణతో సినిమా చేయాలనే కల మాకు ఈ చిత్రంతో తీరింది. ఆయన కెరీర్లో మైల్స్టోన్ లాంటి సినిమాకు మేము నిర్మాతలు కావడం గర్వంగా వుంది’ అన్నారు.