వరుణ్ సందేశ్, జెమిని సురేశ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాక్ మెయిల్’. శ్రీనివాస్ గండ్రెడ్డి రచన, దర్శకత్వంలో అవినాష్ కూనపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచాన్ చేశారు. జెమినీ సురేశ్ తల్లి ఎం.వెంకటసుబ్బలక్ష్మి తొలి షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ని నిర్మాత చేతుల మీదుగా దర్శకుడు అందుకున్నారు. అతిథులంతా సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అవకాశం ఇచ్చిన నిర్మాతకు దర్శకుడు శ్రీనివాస్ గండ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మంచి కంటెంట్తో రూపొందుతున్న సినిమా ఇదని హీరో వరుణ్సందేశ్ చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరో జెమినీ సురేశ్ ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమా లాభాల్లో పదిశాతం పనిచేసిన టెక్నీషియన్స్కి ఇస్తానని నిర్మాత అవినాష్ కూనపురెడ్డి తెలిపారు. పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగమహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జీఎస్ చక్రవర్తిరెడ్డి, సంగీతం: ఎస్వీ మల్లిక్ తేజ, నిర్మాణం: హనుమాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ.